వీరవనిత పాత్రలో నయనతార అంటూ వార్తలు.. ఖండించిన కథానాయిక!

  • శివగంగ ప్రాంతపు రాణి 'వేలు నాచ్చియార్'
  • సుశీగణేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కథ  
  • అటువంటి సినిమా ఏదీ చేయడం లేదన్న నయన్ 
  • రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్న టీమ్ 
రాణి 'వేలు నాచ్చియార్' పాత్రలో తాను నటిస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ కథానాయిక నయనతార తాజాగా ఖండించింది. 18వ శతాబ్దంలో తమిళనాడులోని శివగంగ ప్రాంతపు రాణిగా భాసిల్లిన వేలు నాచ్చియార్ అప్పటి బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీపై దండెత్తిన వీరవనితగా పేరుతెచ్చుకుంది. ఆమె ధైర్యసాహసాలను వివరిస్తూ, తమిళనాట ఇప్పటికీ ఆమె గురించి గొప్పగా కీర్తిస్తూ వుంటారు.

ఆమె కథను దర్శకుడు సుశీ గణేశన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను నయనతారపై పోషించనున్నట్టు గత రెండు రోజులుగా మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఇది నయనతార దృష్టికి వెళ్లడంతో, దీనిపై  తాజాగా ఆమె స్పందించింది. ఈ విషయమై తన పీఆర్ టీమ్ ద్వారా ఆమె ఓ వివరణ ఇచ్చింది.

"రాణి వేలు నాచ్చియార్  జీవితకథతో తెరకెక్కుతున్న పిరీడ్ మూవీలో నయనతార నటిస్తున్నట్టు ఓ వర్గం మీడియాలో వార్తలొస్తున్నాయి. అటువంటి సినిమా ఏమీ తాను చేయడం లేదని నయనతార ఖండిస్తున్నారు. ఇది నిరాధారమైన వార్త. ఇటువంటి వార్తలు రాసేముందు వాస్తవాలను తెలుసుకోవాలని నయనతార తరఫున కోరుతున్నాం" అంటూ ఆమె పీఆర్ టీమ్ పేర్కొంది.

Nayanatara
Sushi Ganeshan
Velu Nachiyar

More Telugu News